Sunday, February 27, 2011

TEACHER ELIGIBILITY TEST (TET)

TEACHER ELIGIBILITY TEST (TET) - NCTE NEW GUIDELINES FOR TEACHER RECRUITMENTS - ARTICLE FROM ANDHRAJYOTHY

ఇక ఏటేటా టెట్ పరీక్ష.. సర్టిఫికెట్‌కు ఏడేళ్లు మాత్రమే విలువ - ప్రైవేటు స్కూళ్లకూ వర్తింపు.. విద్యా హక్కు అమలులో మరో అడుగు
బీఈడీ, డీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి దుర్వార్త! డీఎస్సీ రాసేసి పోస్టు సాధిద్దామనుకుంటున్న లక్షలాది మంది జీర్ణించుకోలేని వార్త! వీరంతా... మరో పరీక్ష రాయాల్సిందే! అదే... ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ -టెట్). 60 శాతం మార్కులతో ఈ పరీక్షను గట్టెక్కిన వారికే ఉపాధ్యాయులయ్యే అర్హత లభిస్తుంది. డీఎస్సీ రాసేందుకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్, జిల్లా పరిషత్ పాఠశాలలతోపాటు... ప్రైవేటు స్కూళ్లలో టీచర్ పోస్టు కావాలన్నా 'టెట్' కొట్టాల్సిందే!

కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకులకు నెట్, స్లెట్ పరీక్షల్లాగా ఉపాధ్యాయులు అయ్యేందుకు 'టెట్' పరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. విద్యా హక్కు చట్టం-2009 అమలులో భాగంగా కాబోయే ఉపాధ్యాయులకు ఈ పరీక్షను నిర్వహించి తీరాలని జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఎన్‌సీటీఈ) నిశ్చయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ స్థాయిలో ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలు అమలు చేసేందుకు 'టెట్' తప్పనిసరని తేల్చిచెప్పింది.
"విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా దేశ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు జరపాల్సి వస్తోంది. అందువల్ల... విద్యా ప్రమాణాలు పతనం కాకుండా ఈ పరీక్ష పెట్టాలని నిర్ణయించాం'' అని ఎన్‌సీటీఈ పేర్కొంది. ఒక్కసారి ఒక్కసారి జారీ చేసిన టెట్ సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే అమలులో ఉంటుంది. ఈలోపు టీచర్ పోస్టు రాకుంటే... మరోమారు పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించాల్సిందే!

ఇప్పటికే ఉద్యోగాలు వచ్చిన వారు ఈ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన కొత్త నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం ఒకసారి ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుం ది. ఏదేని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పరీక్ష పెట్టడానికి నిరాకరిస్తే... ఆ రాష్ట్రంలో ఎన్‌సీటీఈ నిర్వహించే పరీక్ష వర్తిస్తుంది. ప్రైవేట్ పాఠశాలలు ఎస్‌సీటీఈ లేదా ఎన్‌సీటీఈ నిర్వహించే పరీక్షల్లో ఏదో ఒకదానిని అనుసరించాల్సి ఉంటుంది.
మూడు పరీక్షలు రాయాల్సిందే!
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతోపాటు కేంద్రీయ విద్యాలయాల్లోని టీచర్ పోస్టులకు అర్హత సాధించాలంటే... మూడు 'టెట్'లు పాస్ కావాల్సిందే. 'టెట్'లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ప్రాథమిక పాఠశాలలకు (1 నుంచి 5 తరగతులు) ఉద్దేశించింది. రెండో పేపర్ ప్రాథమికోన్నత (6 నుంచి 8 తరగతులు) పాఠశాలల కోసం నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లలో ఉత్తీర్ణత సాధిస్తేనే... రెండు రకాల పోస్టులకు అర్హులవుతారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఈ పాఠశాలలకు రాష్ట్ర ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఎస్‌సీటీఈ) పరీక్ష నిర్వహిస్తుంది.
ఇక కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టుల భర్తీ కోసం ఎన్‌సీటీఈ 'టెట్' నిర్వహిస్తుంది. వెరసి... అన్ని రకాల పోస్టులకు అర్హత సాధించాలంటే అభ్యర్థులు మూడు టెట్‌లు 60 శాతం మార్కులతో పాస్ కావాల్సిందే. అన్ని రాష్ట్రాలు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు లోబడి ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల నియామకాల కోసం టెట్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని యూటీఎఫ్ ఖండించింది.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో డీఎస్సీలాంటి పరీక్షలు పెట్టి ప్రతిభావంతులనే ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారని గుర్తు చేసింది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యలో ఉపాధ్యాయుల నియామకాల అధికారం రాష్ట్రాలకే ఉంది. ఇప్పుడు టెట్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఇందులోనూ జోక్యం చేసుకుంటోందని యూటీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తాయని పేర్కొంది.
ఇదీ పరీక్ష...
* పరీక్ష నిడివి 90 నిమిషాలు.
* అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
* టెట్‌లో రెండు ఆప్షన్ పేపర్స్ ఉంటాయి.
* ప్రాథమిక పాఠశాలల టీచర్లు మొదటి పేపర్, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు రెండో పేపర్ రాయాలి.
* ఫస్ట్ పేపర్‌లో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగ్, లాంగ్వేజ్ 1 (బోధనా మాధ్యమం), లాంగ్వేజ్ 2 (ఎన్‌సీటీఈ సూచించిన జాబితా నుంచి ఒకదానిని ఎంచుకోవాలి), గణితం, పర్యావరణ అధ్యయనం నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. అంటే... మొత్తం 150 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
* పేపర్-2లో మూడు కంపల్సరీ సెక్షన్స్ ఉంటాయి. అవి... చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగ్, లాంగ్వేజ్ 1, 2. గణితం, సైన్స్ టీచర్లకు ఆ విభాగాల నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. సోషల్ స్టడీస్ టీచర్లకు ఆ సబ్జెక్టుపై 60 ప్రశ్నలు ఉంటాయి.
No. 76-4/2010/NCTE/Acad - Dated: 11/02/2011 - RTE - TET GUIDELINES RELEASED BY NCTE UNDER RTE ACT 2009

No comments: